11, నవంబర్ 2011, శుక్రవారం

రెండో ఎస్సార్సీ అంటే మెరుపు సమ్మె


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీ అంటే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులంతా ఉద్యోగులతో కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది తెలంగాణ ప్రజా ప్రతినిధుల వైఖరి వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో సకల జనుల సమ్మెను విరమిస్తేనే తెలంగాణ గురించి స్పష్టమయిన ప్రకటన చేస్తామని గులాం నబీ ఆజాద్ సూచించారని, ఆయన విన్నపం మేరకు తాము సకల జనుల సమ్మెను విరమించామని, మళ్లీ తెలంగాణ విషయంలో మోసం చేస్తే సమ్మె చేసేందుకు వెనకడుగు వేయమని హెచ్చరించారు.
దీంతో పాటు  చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన బీజేపీ, రెండో ఎస్సార్సీని వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ నేత బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ అంటూ కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని మండిపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్‌లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి డీకే అరుణను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణ ద్రోహి అయిన డీకే అరుణ వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున తెలంగాణవాదులు నినాదాలు చేశారు. దీంతో రచ్చబండ రసాభాసగా మారింది. 

1 కామెంట్‌: