26, జులై 2014, శనివారం

కేసీఆర్ మీద ఏడిస్తే ఏమొస్తుంది ?!!


ఎన్కంగ ఏనుగులు వొయ్యినా పర్వలేదు గాని ముందలంగ ఎల్కలను గుడ పోనిస్తలేరు భజనసేనకు చెందిన
స్వయంప్రకటిత అపర దేశభక్తులు. తెలంగాణలో తెలుగుదేశం - బీజేపీ పొత్తును జనం ఛీకొట్టడంతో మతి చెడ్డ ఈ ఫేస్ బుక్ యోధులు ఇక టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ నిర్ణయాల మీద పడి ఏడుస్తున్నారు. తాజాగా కేసీఆర్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ను చేసి రూ.కోటి నగదు పారితోషికం ప్రకటించడంతో ఈ మేధావులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రజల సొమ్మంతా కేసీఆర్ దోచిపెడుతున్నాడు తెగ ఊగి పోతున్నారు.

కూట్లరాయి తియ్యలేనోడు ఏట్ల రాయి తీస్తనన్నట్లు ..సానియా మీర్జాను వివాదాల్లోకి లాగి హీరోలయిపోయినట్లు ఫీలయ్యారు. తీరా జాతీయ బీజేపీ పార్టీ కాస్త సానియాకు మద్దతు పలకడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు తమ వ్యాఖ్యలను ఎలా వెనక్కు తీసుకోవాలో తెలియక తికమకపడ్డారు. బీజేపీ నేత లక్ష్మణ్ సానియామీర్జాను తప్పుపడితే ..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ఆంధ్రా విద్యార్థులకు కేసీఆర్ ఫీజు రీ ఎంబర్ప్ మెంట్ ఇవ్వడానికి 1956 స్థానికతను తెరమీదకు తెచ్చాడని, పిల్లలకు ఫీజులు కట్టడు గాని సానియాకు మాత్రం కోటి ఇచ్చాడని చెప్పడమే తమ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఉద్దేశమని సర్ధి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ విషయంలో బీజేపీ పార్టీకి ఓ స్పష్టత లేదని, ఈ విషయంలో తాము తొందరపడి అనవసరంగా ఎంటరయ్యామని కాస్త లేటుగా తెలుసుకున్నారు.

ప్రజాధనం మీద ఇంత బాధ్యత ఉన్న ఈ భజనపరులు కేంద్రంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడానికి మాత్రం ముందుకురారు. కోటిరూపాయలు సానియామీర్జాకు ఇస్తే నెత్తీ నోరు బాదుకున్న వీరు మరి రిలయన్స్ అంబానీలకు లబ్ది చేకూర్చే పనిలో ఉన్న మోడీని ఎందుకు ప్రశ్నించరు అన్నది వారికే తెలియాలి. కేజీ బేసిన్ లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను యూనిట్ కు 4.1 డాలర్ల నుండి 8.2 డాలర్లకు పెంచేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ నిర్ణయంతో లక్షల కోట్ల ప్రజాధనం రిలయెన్స్ కు దోచిపెట్టే కుట్ర ఉంది. యూపీఏ హయాంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని తప్పించి మరీ గ్యాస్ ధరను పెంచుకునేందుకు సిద్దమయి విశ్వప్రయత్నాలు చేసి ఆగిపోయింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మూడింటి ధరలు పెంచి ..ఇక రిలయెన్స్ గ్యాస్ ధర కూడా పెంచి వాళ్ల సేవలో తరించేందుకు సిద్దమవుతోంది.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తన నిర్ణయాలతో ప్రజల మనసులు గెలుచుకున్నాడు. తొమ్మిదేళ్ల అనుభవం అంటూ మీడియా ముందు మీసాలు తిప్పుతున్న చంద్రబాబుకు తన చర్యలతో కేసీఆర్ అనుభవానికి - ఆచరణకు చాలా వ్యత్యాసం ఉంటుందని చాటుతున్నాడు. కేసీఆర్ నిర్ణయాలతో మోడీ భక్తులకు బుగులు రేగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను బద్ నాం చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని వీళ్లు వదులుకోవడానికి సిద్దపడడంలేదు. రైలు ప్రమాదంలో పిల్లలు చనిపోతే వేగంగా స్పందించిన తెలంగాణ సర్కారు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి నాణ్యమైన వైద్యం అందేలా చూసింది. స్వయంగా మంత్రి పద్మారావు ఏకంగా సంఘటనా స్థలం నుండి అంబులెన్సులోనే ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ మంత్రులను అప్రమత్తం చేసి తను యశోద ఆసుపత్రిలో పిల్లల పరిస్థితిని పరిశీలించారు.

కానీ ఈ అపర మేధావులు మాత్రం కేసీఆర్ సంఘటనా స్థలానికి వెళ్లలేదని, ఆయన నియోజకవర్గంలో అంతపెద్ద ప్రమాదం జరిగితే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నలు మొదలుపెట్టింది. గాయపడిన విద్యార్థులకు తక్షణ సహాయం అందిందా ? లేదా ? చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏమయినా నిర్లక్ష్యం చేసిందా ? అన్న ప్రశ్నలు రావాల్సిన సమయంలో కేసీఆర్ రాలేదని ఓ రాయి విసిరి ఆనందపడ్డారు. ఇక వీరికి పచ్చమీడియా జేజేలు పలికి జెండాలు ఊపింది. ఎంతసేపూ కేసీఆర్ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాలు తప్పితే ఒక్కటి కూడా తెలంగాణకు పనికివచ్చే సూచన మాత్రం రాదు. అబద్దాలు ఒక్కోసారి ఎక్కువ ప్రచారంలోకి రావచ్చు ..అవి తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు కానీ ..నిజాలు ఎప్పుడూ జనానికి గుర్తుండిపోతాయి. ఇప్పటికయినా ఈ చర్యలు మానుకోకుండా 'గోడమీద రాయి యాడనో నూక్కున్నట్లు' జనమే వీరికి తగిన సమాధానం చెబుతారు.

sandeepreddy kothapally



22, జులై 2014, మంగళవారం

టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏం చెప్పింది ?


పనికిమాలిన పచ్చపత్రిక (పత్రిక అనడానికి సిగ్గేస్తోంది) 'సీమాంధ్రజ్యోతి' పిచ్చిరాతలు పట్టుకుని మోడీ భజనపరులు తెగ రెచ్చిపోతున్నారు. తమను తాము ఈ దేశాన్ని ఉద్దరించేవారిగా ఫీలవుతున్న కుహానా మేధావులు తెగ ఫీలయిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ సీమాంధ్రజ్యోతి చేసిన నిర్వాకం ..తెలంగాణ ఉద్యమకారుల మనోస్థైర్యం దెబ్బతినేలా రాసిన కథనాలు ..దీని నిర్వాకం మూలంగా ఎంతమంది ఉద్యమకారులు నేలకొరిగారో అందరికీ తెలిసిందే. ఇలాంటి పనికిమాలిన మీడియా రాసిన రాతలు అక్షర సత్యాలయినట్లు తెగ తొందరపడిపోతున్నారు.

ఓ పత్రిక నిర్వహించిన చర్చలో పాల్గొన్నఎంపీ కవిత "1947 స్వాతంత్రానికి తెలంగాణ, జమ్మూకాశ్మీర్ లు ప్రత్యేక దేశాలని, ఆ తరువాత సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలను ఈ దేశంలో కలిపారని" తెలిపింది. దీనికి మసిపూసి మారేడుకాయ చేసి ..స్వంతకవిత్వం జోడించి వండి వార్చి ఏదో కలకలం రేపుతాం అన్నంత రీతిలో సీమాంధ్రజ్యోతి లేఖిరాతలతో కథనం ప్రచురించింది. అది పట్టుకుని కుహానా దేశభక్తులు తెగ ఊగిపోతున్నారు.

1947 ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఆ తరువాత సైనిక చర్య ద్వారా తెలంగాణకు విముక్తి లభించింది అన్నది తెలంగాణ ఉద్యమంలో వందలసార్లు చెప్పుకున్నదే. తెలంగాణ వాదులు అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 17 విమోచన దినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చర్చలో వెల్లడిస్తే ఏదో జరిగిపోయిందని తెగ బాధపడిపోతున్నారు.

వీరి రాతలు ..పూతల్లో ఎంపీ కవిత మాట్లాడిన అంశాల మీద చర్చ చేయాలన్న తపనకంటే ..తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ అధినేత కూతురిని దోషిగా నిలబెట్టడానికి అవకాశం దొరికింది అన్న ఆనందమే ఎక్కువ కనబడుతోంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి కుహానా దేశభక్తులారా ..తెలంగాణ వాదులను మించిన దేశభక్తుడు ఎవ్వడూ లేడు. అందుకే 60 ఏళ్లు ప్రజాస్వామ్యబద్దంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. మేం ఎన్నుకున్న మా నాయకులే మమ్మల్ని వెన్నుపోటు పొడిచినా బరించి పోరాడాం. వగల ఏడ్పులు మాని బురద జల్లడం మానుకోండి.

sandeepreddy kothapally

www.facebook.com/thovva 

13, జులై 2014, ఆదివారం

కేసీఆర్ కు ప్రజలే ప్రతిపక్షం !

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టడంతో కోస్తాంధ్ర పెట్టుబడిదారి వర్గాల కళ్లు మండుతున్నాయి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నలుమూలలకు తీసుకెళ్లి ..సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి నడిపించి ..తెలంగాణ ఎందుకు కావాలి ? ఎందుకు రావాలి ? అన్నది సూక్ష్మంగా అందరికి వివరించి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాడని చంద్రబాబు అనుకూల ..చంద్రబాబు కొమ్ముకాసే సీమాంధ్ర మీడియా మాఫీయా ఏ మాత్రం అంచనా వేయలేదు. కలలో కూడా వారు ఈ విషయాన్ని ఊహించలేదు.

ఎందుకంటే గత 14 ఏళ్లుగా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని తెరమరుగు చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిని అతలా కుతలం చేయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఇంకా ముఖ్యంగా కేసీఆర్ 11 రోజుల నిరహార దీక్ష 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తరువాత ఈ వర్గంలోని అహంభావం, వికృత స్వభావం, తెలంగాణ వ్యతిరేక భావన జడలు విప్పింది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వీరు చేయని ప్రయత్నం ..మొక్కని దేవుడు ..ఎక్కని గడప లేదని చెప్పాలి. 

ఈ కుట్రలను ..ఈ కుతంత్రాలను చేధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టాడు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి చూయించాడు. ఇంత చేసిన కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే తెరమరుగు చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ వచ్చింది ..ఇక కేసీఆర్ తో పని ఏముంది అని ప్రజల్లోకి
విస్తృతంగా తీసుకెళ్లే విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ లేదా టీడీపీ - బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తమ అక్రమవ్యాపారాలకు ..తమ అక్రమ నిర్మాణాలకు సంపూర్ణ భద్రత ఉంటుందని ఈ సాహసానికి ఒడిగట్టారు.

కానీ కేవలం తెలంగాణ ప్రజల మీద నమ్మకం ..తెలంగాణ ప్రజల మీద ఉన్న విశ్వాసంతో కేసీఆర్ ఎన్నికల గోదాలోకి ఒంటరిగా అడుగుపెట్టారు. రోజుకు 10 సభల చొప్పున 100కు పైగా సభల్లో పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించి ..ఒప్పించి అధికారం చేజిక్కించుకున్నారు. అధికారం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ మీద బురదజల్లే ప్రయత్నాలు పెట్టింది సీమాంధ్ర మీడియా మాఫియా. జర్నలిజం విలువలను నడిబజార్లో వదిలేసి నగ్నంగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్నతనం చేసేందుకు ప్రయత్నించి తన కురచబుద్దిని చాటుకుంది. కేసీఆర్ వ్యతిరేక వర్గాలను ప్రభుత్వం మీదకు ఉసిగొలిపే ప్రయత్నం చేసింది. కానీ ఈ మీడియా మాఫియాకు కేసీఆర్ పెట్టాల్సిన మందే పెట్టారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ తన దారిన తాను సాగిపోతున్నాడు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ...మహమూద్ అలీ, రాజయ్య, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి జోగు రామన్న తదితరులతో పాటు, ఎంపీలు వినోద్ కుమార్, కవిత, కడియం శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, ఎపి జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇక ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజు, లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, బొడిగె శోభ, యాదగిరి రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, అంజయ్యయాదవ్, గొంగిడి సునీత, దాస్యం వినయ్ భాస్కర్, స్పీకర్ మధుసూదనా చారి ఇలా కొందరు మినహా అందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకమయిన వారే. తెలంగాణ ఉద్యమంలో ఆటు పోట్లు ఎదుర్కొన్నవారే. ప్రభుత్వ అణచివేతను ..పెట్టుబడి దారి వర్గాల హేళనలను తట్టుకుని ఉద్యమంలో నిలబడ్డవారే. తమ ఆస్తులను తెలంగాణ ఉద్యమం కోసం ధారపోసిన వారే.

వీరందరికీ తమ తమ జిల్లాలోని, నియోజకవర్గంలోని ప్రజలతో విస్తృతస్థాయి సంబంధాలు ఉన్నాయి. ఉద్యమంలో ప్రజలతో మమేకమయి గడిపిన నేపథ్యం వీరికి ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలోని తప్పు ఒప్పులను నేరుగా వీరికి చెప్పే సానిహిత్యం తెలంగాణ ఉద్యమకారులకు ఉంది. ఇంతటి సానుకూల అంశం ఇప్పటివరకు దేశంలో ఏర్పడిన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకపోవచ్చు అన్నా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విశ్లేషణాత్మకంగా ప్రజలు ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోగలుగుతారు. తెలంగాణలోని టీఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే బలంగా ఈ ప్రజలే వారికి ప్రభుత్వ లోపాలను ..అనుకూలతలను చెప్పగలిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక గత 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉత్తాన పత్తానాలు చూసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ అవసరాలు ..తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఈ నెల రోజుల పాలనలో ఆయన విజన్ ఏమిటి ? అన్నది కూడా అందరికీ తెలిసిపోయింది.  అందుకే తెలంగాణలోని తొలి ప్రభుత్వానికి ప్రజలే ప్రతిపక్షం. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే అండా దండా.

Sandeep Reddy Kothapally 

please like & share this page

www.facebook.com/thovva 



3, జులై 2014, గురువారం

అమ్మ కరుణించింది ..అన్న కల నెరవేరింది


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నేళ్ల ఉద్యమం ? ఎంతమంది బలిదానాలు ? ఎన్ని కోట్ల మంది ఎదురుచూపులు ? ఎంతమంది ముడుపులు కట్టారు ? ఎంత మంది దేవుళ్లను వేడుకున్నారు. 14 ఏళ్ల క్రితం తెలంగాణ రథసారధి కేసీఆర్ స్వయంగా మోతె గ్రామంలో తెలంగాణ రాష్ట్రం కోసం ముడుపుకట్టారు. మరో గ్రామంలో అఖండజ్యోతిని వెలిగించారు. తెలంగాణ వచ్చేదాకా అరగుండు ..అరమీసంతో ఓ ఉద్యమకారుడు. ఇలా ఎవరికి తోచినట్లు వారు కనిపించిన చెట్టుకు పుట్టకు ..నమ్మిన దైవాలకు మొక్కులు మొక్కుకున్నారు.

ఆ కోవలోనే మన తెలంగాణ ఎక్సయిజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా గుడిలో అడుగుపెట్టనని ప్రతినబూనారు. ఆరేళ్లుగా అమ్మవారి బోనాలకు వెళ్లడం లేదు. ఈ సారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంతో పాటు ..తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రావడం ..మంత్రికావడం జరిగిపోయింది. అందుకే ఎప్పుడు అమ్మవారి బోనాలు వస్తాయా ? తన నాయకుడు కేసీఆర్ తో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుందామా ? అని ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున 2004లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయిన పద్మారావు కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి 2008 లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ..ఆ తరువాత 2009 ఎన్నికల్లో ఓడిపోయినా టీఆర్ఎస్ పార్టీని వీడకుండా ..తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమవ్యాప్తికి టీఆర్ఎస్ నగర్ అధ్యక్షుడిగా  ఎనలేని కృషిచేశారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సగర్వంగా రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిఖార్సుగా ..నిజాయితీగా పనిచేసిన వారిలో ఒకరు పద్మారావు గౌడ్. అమ్మవారి బోనాలకు కేసీఆర్ తో కలిసి వస్తున్న ఆయనకు ఇవే ఉద్యమాభివందనాలు

sandeepreddy kothapally