28, అక్టోబర్ 2011, శుక్రవారం

బాబూ నీది బినామీ బతుకు : కేసీఆర్

చంద్రబాబు నీది బినామీ బతుకు, బినామీలను పెట్టుకుని బతకాల్సిన ఖర్మ నాకు పట్టలేదు.
దోచుకున్న సొమ్ము, దాచుకున్న ఆస్తులు నా దగ్గర లేవు. దమ్ముంటే అవినీతి మీద చర్చకు రా అంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు టీడీపీ అధినేత  చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం టీఆర్‌ఎస్ పై, తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముని వద్ద అప్పు తీసుకున్నానని స్పష్టంచేశారు. తనకు ఉన్నది 24 ఎకరాల భూమేనని, హైదరాబాద్, కరీంనగర్‌లో ఒక ఇళ్లు మాత్రమే ఉందని తెలిపారు. తాను పెట్టిందంతా పూర్తిగా  వైట్ మనీ అని, నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే ఆయన వ్యక్తిగతమని,  దానికి మేం ఏం చేయాలని  ప్రశ్నించారు. బాబులా నల్లధనంతో పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు.
గత ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని,   చంద్రబాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయవంచన, అసలు పేరు కుంభకోణం అని ధ్వజమెత్తారు.   బాబు  అవినీతిపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రికను చూసి తెలంగాణకు ఒక పత్రిక ఉండొద్దు, మీ బండారం బయటపడొద్దని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆత్మలు అమ్ముకుని బాబు బూటు పాలీష్ చేస్తున్నారని ఆరోపించారు.
యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు పోలవరంపై సోనియాకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. పోలవరంపై నిరంతరం కొట్లాడేది టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. పోలవరంపై హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లాం అని తెలిపారు. టెండర్లు వేసే అలవాటు బాబుకు ఉందన్నారు. చంద్రబాబు ఫోటో పక్కన అన్నాహజారే ఫోటో చూస్తే దయ్యాలు నవ్వుతాయని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి