10, నవంబర్ 2012, శనివారం

పరకాల పరాభవం..షర్మిల పాదయాత్ర !


ఎక్కడయినా ఓడిన వారు తమ ఓటమికి  కారణాలు సమీక్షించుకుంటారు. దాదాపుగా అక్కడి పత్రికలు కూడా అదే పని చేస్తాయి. ఆ ఓడిన వ్యక్తిపై గెలిచిన వ్యక్తి ఏ విధంగా గెలిచాడు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అంతా తిరగబడింది. గెలిచిన వ్యక్తి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడని.. ఓడిన వ్యక్తి మాత్రం దాదాపు గెలిచినంత పనిచేసిందని...అసలు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా గొప్ప అని స్థుతిస్తున్నాయి.

నిజంగా ఒక్క తెలంగాణ విషయంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పత్రికలు ఈ విధంగా స్పందిచడం..ఇలా వార్తలు రాయడం జరగదేమో. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థి మొగులూరి భిక్షపతి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.  ఈ ఓటమిని కొండా సురేఖ జీర్ణించుకుందేమో గాని సీమాంధ్ర పత్రికలకు మాత్రం ఇంకా జీర్ణంకాలేదు. పరకాల ఓడితే తెలంగాణ చాపను చుట్టేయాలని చూసిన ఆ పత్రికలు ఘోర పరాభవం చెందాయి. దాని నుండి అవి భయటపడడం లేదు.

ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత ఇప్పుడు ఎందుకు చర్చ అంటే పరకాల చెల్లెమ్మ పళ్లికిలిస్తుంది. సీమాంధ్ర పత్రికలు మళ్లీ మొరుగుతున్నాయి. తెలంగాణ ను నిండా ముంచిన తండ్రిని స్తుతిస్థూ అన్న జగన్ ను అధికార పీఠం ఎక్కించేందుకు వైఎస్ తనయ షర్మిల తెలంగాణ లో పాదయాత్రకు పరుగు పరుగునా వస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు కొడిగడుతున్నా పల్లెత్తు మాట మాట్లాడని వారు ఇప్పుడు అమ్మవారి పాదయాత్ర అడుగులకు మడుగులు వత్తేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ వాదులు ఎక్కడ పాదయాత్రకు అడ్డుపడుతారోనని సురేఖమ్మ గుండెల్లో గుబులు రేగుతోంది. అందుకే టీఆర్ఎస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ వాదులను హెచ్చరిస్తోంది సురేఖమ్మ. షర్మిలమ్మ పాదయాత్రను అడ్డుకుంటే మా సత్తా చూపిస్తామని.

 జగన్ దండయాత్రను మానుకోట అడ్డుకున్న సంగతి గుర్తుకువచ్చి ఉంటుంది. తుపాకీ కాల్పులను కూడా కంకర రాళ్లతో ఎదుర్కొన్న కరడుగట్టిన తెలంగాణ వాదులు గుర్తుకు వచ్చి ఉంటారు. అందుకే పాదయాత్ర కు ముందే అమ్మ సన్నాహక సమావేశాలు మొదలు పెట్టింది. ‘‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు’’ పాదయాత్ర ఇంకా తెలంగాణలోకి రాక ముందే ఈ పరేషాన్ ఎందుకు ? మీ వైఖరిలో స్పష్టత ఉంటే అడ్డుకుంటారన్న అనుమానాలెందుకు ? గుమ్మడి కాయల దొంగ అనకముందే భుజాలు పట్టుకోవడమెందుకు ?


ఇక సోకాల్డ్ సీమాంధ్ర పత్రికలు అప్పుడే భజన మొదలు పెట్టాయి తెలంగాణ అంతటా నేతలు జగన్ పార్టీలోకి చేరడానికి దండలు పట్టుకుని రెడీగా ఉన్నారని..పరకాలలో  వచ్చిన ఓట్లు చూసి ఆ పార్టీలో చేరడానికి ఉత్సుకత చూపుతున్నారని రాసేస్తున్నాయి. అధికారంకోసం దండయాత్రలు చేస్తున్న సీమాంధ్ర పార్టీలకు ఎలా బుద్ది చెప్పాలో తెలంగాణకు తెలుసు. ముందు సురేఖ అంగబలం, అర్ధబలాలను అణగదొక్కి పరకాలలో తెలంగాణ జెండా ఎలా ఎగిరిందో ఈ సీమాంద్ర పత్రికలు ఒక్కసారి నెమరు వేసుకుంటే తెలంగాణలో భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో బోధపడుతుంది. జై తెలంగాణ జై జై తెలంగాణ

2 కామెంట్‌లు: