31, మే 2014, శనివారం

ఎన్ని నిద్రలేని రాత్రులో ..ఎన్ని లెక్కలేని నిందలో ..!


ఒకడు ఫార్మ్ హౌజ్ పార్టీ అన్నడు ...మరొకడు తాగి తందనాలు అన్నడు ..ఒగడు వసూల్ రాజా అన్నడు ..ఇంకొకడు కుటుంబ పార్టీ అని అన్నడు ..అన్నోడు ఆంధ్రోడయినా ..ఆని పక్కన నిలవడి సంకలు గుద్దింది మన తెలంగాణకు చెందిన బానిస నేతలే. ఊరంత తెలంగాణ వైపు ఉంటే ఈ కుహానా మేథావులు మాత్రం ఆంధ్రోని చెంగువట్టుకోని తిరిగిండ్రు. అవకాశం దొరికిన ప్రతిసారి ఉద్యమనేత మీద ఆధారాలు లేని విమర్శలతో ..ఆమోదించలేని వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వీరి పైత్యానికి సీమాంధ్ర మీడియా పైశాచికత్వం తోడయింది. 60 ఏళ్ల తెలంగాణ కలను 14 ఏళ్లలో సాకారం చేసిన కేసీఆర్ మీద ఇంకా తెలంగాణలో అనుమానాలు ఉన్నాయంటే ఇలాంటి బానిస మనస్తత్వం ఉన్న నేతలు, తెలంగాణలో పాతుకుపోయిన సీమాంధ్ర మీడియా పుణ్యమే.

2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందే స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సాన్నిహిత్యం, మార్గదర్శనంతో ..పక్కా ప్రణాళికతో కేసీఆర్ తన పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల తరువాత దేశంలోని 32 రాజకీయ పార్టీలతో తెలంగాణకు అనుకూలంగా లేఖలు సంపాదించి కేంద్రానికి అందించాడు జయశంకర్ సార్, కేసీఆర్ ద్వయం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాబట్టే తెలంగాణతో ఎలాంటి సంబంధంలేని, తెలంగాణలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించని రాజకీయ పార్టీలు ఎన్నో తెలంగాణ డిమాండ్ కు మద్దతు పలికాయి. తెలంగాణ న్యాయమయిన ఆకాంక్ష అని గుర్తించాయి. ఈ క్రమంలో పార్టీలను ఒప్పించేందుకు ..తెలంగాణ ఆకాంక్షను వారికి ఇప్పించేందుకు వారు ఎన్నో నిద్దరలేని రాత్రులు గడిపారు. ఎన్నో ప్రణాళికలు ...కొన్ని వందల గంటల చర్చలు దీనికోసం జరిగాయి. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణకు మద్దతు ఇచ్చినా ..మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం 2008 ఎన్నికలకు ముందు మాత్రమే అధికారం కోసం మాత్రమే తెలంగాణకు అనుకూలం అంటూ ఓ లేఖ ఇచ్చింది. 2009 డిసెంబరు 9 ప్రకటన తరువాత మాట మార్చి టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని తన నైజాన్ని చాటుకుంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం ..టీడీపీ మోసం మూలంగా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఆ రెండు పార్టీలే. ఈ ఆత్మహత్యల పాపం ఆ రెండు పార్టీల పుణ్యమే.

ఒకవైపు కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే ..దానికి సహకరించకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలోని ఎందరో నేతలు, ప్రజాసంఘాలు అని పేరు పెట్టుకుని, తమను తాము నేతలుగా ప్రకటించుకున్న ఎందరో నేతలను సీమాంధ్ర మీడియా మహానేతలను చేసి కేసీఆర్ మీద బురదచల్లించింది. ఆంధ్రబాబులకు గులాంలు అయిన ఎందరో నేతలు కేసీఆర్ మీద అబద్దపు ప్రచారాలు చేసి శునకానందం పొందారు. తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారకులు అయిన ఆంధ్రానేతలు తెలంగాణలో తిరుగుతుంటే వారి యాత్రకు వంధిమాగధులుగా పనిచేసి అమరుల ఆత్మలకు క్షోభ కలిగించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరువాత కూడా ఈ బురద చల్లడం ఆగలేదు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత కూడా కేసీఆర్ మీద విషకక్కారు.

తన పార్టీని తాను విలీనం చేయాలా ? వద్దా ? అన్నది కేసీఆర్ కు సంబంధించిన సమస్య. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య. కానీ సీమాంధ్ర మీడియా తెలంగాణ బిల్లు రాగానే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశాయి. కాదు కూడదంటే కేసీఆర్ ను మోసం చేశాడని దుమ్మెత్తిపోశాయి. చివరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ను, ఆయన పార్టీని కూడా ఈ మీడియా ...దాని వంధిమాగధులు వదిలిపెట్టలేదు. విషపురుగుల్లా వెంటాడారు. వేటాడారు. కానీ ప్రజాక్షేత్రంలో వాటి పప్పులు ఉడకలేదు. కేవలం హైదరాబాద్, దాని చుట్టుపక్కల సీమాంధ్ర కాలనీలలో తప్ప. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ లో ఏకంగా ఆరులక్షల మంది కొత్త ఓటర్లను హైదరాబాద్ పరిసరాలలో కొత్తగా చేర్పించి అక్కడ తెలంగాణ ద్రోహుల పార్టీ గెలిచేందుకు ఎత్తులు వేశారంటే సీమాంధ్ర పార్టీలు..సీమాంధ్ర మీడియా ఎంత జిత్తులమారి నక్కలో అర్ధం చేసుకోవాలి.

ఇప్పుడు కేసీఆర్ అధికారం చిక్కినా ఈ సీమాంధ్ర మీడియా ..అవి తెలంగాణలో పెంచి పోషించిన నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ఖాయం. తెలంగాణ పునర్నిర్మాణంలో కేంద్రం సహకారం లభించకుండా సీమాంధ్ర మీడియా నేతలు తమ వంతు ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇక వాటికి తోడుగా నాయుడు ద్వయం కలిసి కేంద్రం మనసును కలుషితం చేస్తూనే ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదీ ఏమయినా తెలంగాణను అర్ధం చేసుకున్నది ..తెలంగాణ అర్ధం చేసుకున్నది ఒక్క కేసీఆర్ ను మాత్రమే. ఆయనకు ఇక నుండి ఇప్పటివరకు అందించిన అండదండలకంటే రెట్టింపుగా ఇక నుండి అందించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది.

sandeepreddy kothapally

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి