7, డిసెంబర్ 2011, బుధవారం

చెరుకు అరెస్టు అక్రమం : హైకోర్టు



 టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని గురువారం ఆదేశించింది. సుధాకర్ నిర్బంధం అక్రమమని కోర్టు అభిప్రాయపడింది. కాగా న్యాయస్థానం తీర్పుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత దాన్ని నాసా కిందకు మార్చారు. ఈ నెల 6న ప్రభుత్వం సుధాకర్ కు 12  నెలల నిర్భంధం విధిస్తూ జీవో వెలువరించింది.
ఒక పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై నాసా చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ గోపాల్‌రెడ్డి, జస్టిస్ కాంతారావుతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. చెరుకు సుధాకర్‌పై పెట్టిన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి విజయం సాధించిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు ప్రజాసామ్య విజయమని వర్ణించింది. కిరణ్ సర్కార్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పని అన్నారు. హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

6, డిసెంబర్ 2011, మంగళవారం

ఉద్యమనేతకు 12 నెలల నిర్భంధం


టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు డా. చెరుకు సుధాకర్‌ను మరో 12 నెలలు జైలులో ఉంచాలని ప్రభుత్వం జీవో నం. 5431ని జారీ చేసింది. చెరుకు సుధాకర్ పీడీ యాక్ట్‌పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణను పూర్తి చేసింది. చెరుకు సుధాకర్ హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ప్రకారం మరో 12 నెలలు జైలులో ఉంచాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత నెల 3 న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుండి వరంగల్ జైలుకు తరలించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను విడుదల చేయాలని తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ 48 గంటలపాటు నిరాహారదీక్ష చేశారు. అయినప్పటికి ప్రభుత్వం ఆయనను విడుదల చేయకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదట పీడీ యాక్టు కింద అరెస్టు చేసి తరువాత నాసా కిందకు మార్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే సీమాంధ్ర ప్రభుత్వం నిరంకుశంగా నిర్భందించిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా దీనికి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.