మంగళవారం 29 జనవరి 2013

సీల్డ్ కవర్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా !


“ప్రధానమంత్రిని, సోనియాగాంధీని కేసీఆర్ దూషించారని, ఆయన మాటలు విని సిగ్గుపడుతున్నామని అంటున్న నేతలు అసలు ఆయన మాటల్లో తప్పేముందో చెప్పాలి. ఉన్న మాట అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉలికి పడుతున్నారని” టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. చప్రాసీకి ఉన్న ఆలోచన ప్రధానికి లేదు అన్నారని దానిలో తప్పేముంది ? అందులో వ్యక్తిగత దూషణ  ఏముంది ? అని అన్నారు. ఈ దేశంలోని పౌరులందరూ సమానమేనని, చప్రాసీలంటే కాంగ్రెస్ నేతలకు చులకనా అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మనసుల్లో మెలుగుతున్నవేనని, షిండే, ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో మంటపెట్టిందని, అది అనుభవించిన వారికి తెలుస్తుందని ఆయన అన్నారు. సీల్డ్ కవర్ సీఎం అయిన కిరణ్ కేసీఆర్ విమర్శిస్తాడా ? స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తాడా ? దమ్ముంటే మున్సిపత్, పంచాయతీ ఎన్నికలు పెట్టు అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
సోనియాగాంధీ రాచి రంపాన పెడుతుంది అన్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. ఇందిగాంధీ హయాంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపి 369 మంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్నాడని అదే విషయం కేసీఆర్ చెప్పారని అన్నారు. కేసీఆర్ ఓ ప్రాంతానికి నేత అని అంటున్న నేతలకు 2004 లో కేసీఆర్ ఇంటికి వచ్చి గులాం నబీ ఆజాద్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు ? అన్నది గుర్తులేదా ? వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ కు ప్రాణం పోసింది కేసీఆర్ కాదా అని అన్నారు. ఆ రోజు ఈ చిన్న నేత కేసీఆర్ ఇంటికి ఎందుకు వచ్చారు. ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. కేసీఆర్ ఏమయినా కోల్ స్కాంకు పాల్పడ్డాడా ? కామన్వెల్త్ కుంభకోణానికి పాల్పడ్డాడా ? 2జి స్కాంకు పాల్పడ్డాడా ? కేవలం తెలంగాణ ప్రజలకోసం తెలంగాణ అడుగుతున్నాడు. మా హక్కుల గురించి మాట్లాడితే, మా అన్యాయం గురించి మాట్లాడితే మీకు సంస్కారం, సంస్కృతి గుర్తొస్తుందా ? అని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ ను వేధించేందుకు కేసులు అని అంటున్నారని అన్నారు.
తెలంగాణ గురించి రాజీనామా చేయమంటే తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ చేరి కేసీఆర్ మీద కేసులకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నంధ్యాల సభలో వైఎస్ తెలంగాణకు వెళ్లాలంటే వీసా కావాలని, పాస్ పోర్ట్ కావాలని వైఎస్ అన్నాడు. ఈ దేశంలో ఉన్న తెలంగాణకు వీసా, పాస్ పోర్ట్ తీసుకువెళ్లాలన్న వైఎస్ ది దేశద్రోహం కాదా ? ఆరోజు వైఎస్ మీద కేసులు ఎందుకు పెట్టలేదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కుట్రలో తెలంగాణ మంత్రులు భాగస్వాములు కావడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పూ లేదని, కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల తరపున మాట్లాడిందని అందులో ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని అన్నారు.

శుక్రవారం 4 జనవరి 2013

సీమాంధ్ర మైకులకు పక్షవాతమెందుకో ?


''జనవరి 1 నుండి నా రాజీనామ అమలులో ఉంటుంది. నాకు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో గానీ, ఎంపీ పదవితో గానీ ఎలాంటి సంబంధం లేదు. జనవరి నుండి నా రాజీనామా అమలులో ఉంటుంది"

కాంగ్రెస్ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు మాట్లాడిన మాటలు ఇవి. కానీ జనవరి 1 వ తేదీ దాటి నాలుగు రోజులు గడిచినా తాను ఇచ్చిన మాటపై కావూరి కనీసం నోరు కూడా తెరవడం లేదు. తెలంగాణ అంటే తొడగొట్టి మాట్లాడే ఈ పెద్ద మనిషికి తాను ఇచ్చిన వాగ్ధానం గురించి తెలియదా ? ఆయన ఎలాగూ స్వార్ధపరుడు వదిలేద్దాం. మరి సీమాంధ్ర ఛానళ్ల మైకులు, సీమాంధ్ర పత్రికల పెన్నులు ఎందుకు మూగబోయాయో అర్ధం కావడం లేదు. వాటికి ఎందుకు పక్షవాతం వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు. ఓ ప్రజా ప్రతినిధి ...అందునా ఎంపీ ఓ ఛాలెంజ్ చేశాక..దాని గడువు దాటాక ఇంతవరకు ఈ పత్రికలు ఆ మాటకు ఎందుకు కట్టుబడ లేదని ఎందుకు ప్రశ్నించవు ?

ఇదే తెలంగాణ చెందిన కేసీఆర్ లేక హరీష్ రావు, కేటీఆర్ లేక మరే ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు అయినా ఇలా ఛాలెంజ్ చేసి మాటతప్పితే ఈ సీమాంధ్ర మైకులు ఇలాగే ఊరుకునేవా ? వెంటబడి మరీ వేధించేవి. దానికి సమాధానం చెప్పినా వ్యతిరేక వార్తలు గుప్పించేవి. నిజంగా ఈ సీమాంధ్ర మీడియాకు సిగ్గుంటే తెలంగాణ సమస్య ఇన్నాళ్లు నలుగుతూ వచ్చేదా ? అందుకే మిత్రులారా బివేర్ ఆఫ్ సీమాంధ్ర మీడియా..బివేర్ ఆఫ్ సీమాంధ్ర నేతలు
జై తెలంగాణ ...జై జై తెలంగాణ

బుధవారం 26 డిసెంబర్ 2012

చంద్రబాబే వెళ్లాలి ..ముక్కు గిల్లి రావాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమస్య మీద ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఈ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున ప్రతినిదులు తప్ప పార్టీల రాష్ట్ర అధ్యక్షులు వెల్లడం లేదు. కేవలం దాటవేత ధోరణి రాజకీయ ప్రయోజనాలు తప్ప వీరు  వెళ్లకుండా ఉండడానికి ఎలాంటి కారణాలు లేవు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం తమ పార్టీని ఇరుకున్న పెట్టేందుకే కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశం పెట్టిందని పిల్లిమొగ్లు వేస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు తెలంగాణ సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ది ఉంటే అఖిలపక్ష సమావేశానికి ఢిల్లీ వెళ్లి అక్కడ పట్టుబట్టి కాంగ్రెస్ అభిప్రాయం చెప్పాలని, తమ పార్టీ అభిప్రాయం చెబుతామని బైఠాయించాలి. అంతేగాని ఇక్కడ ఏదో మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని అడిగిన తెలంగాణ జేఏసీ ప్రతినిధులు తెలంగాణకు జై అనాలని కోరితే జై కొట్టని చంద్రబాబు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తాడు అనుకోవడం వట్టి భ్రమ.

ఇక పార్లమెంటులో సమైక్య జెండాను ఎత్తుకొని మానుకోట రాళ్ల ఆగ్రహం చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు బాటలోనే ఉంది. వీరికి తెలంగాణకు అనుకూలమని చెప్పి ఓట్లు దండుకునే ఆలోచన తప్పితే ఈ సమస్యను తేల్చి చెప్పాలని డిమాండ్ చేసే బాధ్యతను ఏమాత్రం గుర్తించడం లేదు. తెలంగాణలో వైఎస్ పెంచి పోషించిన పెంపుడు గుర్రాలు ఇప్పుడు వీరికి వంత పాడుతున్నాయి. కొంతమందిని అయితే ప్రబావితం చేయగలరు కాని అందరినీ ప్రభావితం చేయలేరన్న సత్యాన్ని వీరు గుర్తించాలి,

ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప ఎమ్మెల్యేలు, మంత్రులు అస్సలు తెలంగాణ సమస్యను గుర్తించడం లేదు. ఎంత సేపు ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాలకు ఇచ్చే నిధులు, తమకు వచ్చే లాభాల ఆలోచన తప్పితే వీరికి మరో ఆలోచన లేదు. ఇప్పటికే కాలం దాటిపోయింది. అదును దాటినంక ఆలోచన చేసినా ఫలితం ఉండదు. రాజకీయ పార్టీలు తెలంగాణ వైపా ? సీమాంధ్ర వైపా ? ఆ పార్టీలకు వంత పాడుతున్న నేతలు ప్రజల పక్షమా ? లేక సీమాంధ్ర పాలకులు విసిరే ఎంగిలి మెతుకుల పక్షమా ? అలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

సోమవారం 17 డిసెంబర్ 2012

ఉరికొయ్యలు అమరులకు ఉయ్యాలలు



ఉరికొయ్యలు అమరులకు ఉయ్యాలలు
మీ చితి మంటలు నేతల చలిమంటలు
స్వార్ధపరుల సంపి మనం సాధిద్దం తెలంగాణ ''ఉరికొయ్యలు'' (2)

ఎల్బినగర్ చౌరస్తల శ్రీకాంతుని తొలి మరణం
ఎన్ సీసీ గేటు ముందు యాదన్న బలిదానం
ఉస్మానియ క్యాంపస్ ల ఇషాన్ రెడ్డి తొలిముడుపు
పార్లమెంటు చెట్టుకింద యాదన్న వాంగ్మూలం
ప్రజాస్వామ్య దేశానికి జరిగినట్టి అవమానం ''ఉరికొయ్యలు''

మండుతున్న గుండెలపై చంద్రబాబు పాదయాత్ర
ఎండుతున్న డొక్కలపై షర్మిలదే ప్రస్థానం
మన ఆస్తులు దోచుకున్న జగన్ బాబు జైలు యాత్ర
ఎవడొచ్చిన ఆగుతుంద తెలంగాణ జైత్రయాత్ర
జై తెలంగాణ జై జై తెలంగాణ ''ఉరికొయ్యలు"

బుధవారం 21 నవంబర్ 2012

ఈ ‘షర్మిల’ ఏ ‘వీసా’తో ?


మయసభల ద్రౌపదిలా మీ అయ్య శాసనసభల నవ్విన ఎకిలి నవ్వులు ఇంకా మా కండ్లల్ల మెదులుతనే ఉన్నయి..అధికారం కోసం మా పంచన చేరి..తెలంగాణ డిమాండును ఢిల్లీ పెద్దలకు చెప్పి ఎన్నికల్ల గెలిచినంక పొత్తు పెట్టుకున్న పార్టీని చిలువలు పలువలు చేసి అసలు తెలంగాణ ఊసే లేకుండా చేయాలన్న కుటిలయత్నం మాకు ఇంగా గుర్తుంది.

ఏరు దాటినంక తెప్ప తగలేసినట్లు తెలంగాణల ఓట్లు ముగిసినదాంక ఏం మాట మాట్లాడకుండా నంధ్యాల సభల మీ అయ్య మాట్లాడిన మాటలు మా చెవుల్ల మార్మోగుతనే ఉన్నయి. తెలంగాణకు పోవాల్నంటే.. వీసా కావాల్నంట...హైదరాబాద్ వాళ్ల అయ్య జాగీరంట అని అన్న మాటలు మా గుండెల్ని మండిస్తనే ఉన్నయి. అవును హైద్రవాదు..మా అయ్య జాగీరే...ఇయ్యాల మీరు ...మీ కుటుంబం ఏ వీసా మీద తెలంగాణల తిరగుతున్నరు. అయ్య కోసం చచ్చిండ్రని ఓదార్పు కథలు చెప్పిన మీరు...తెలంగాణ కోసం బలయిన వందల అమరుల కుటుంబాల్లో ఒక్కరినయినా ఓదార్చిండ్రా ?

సీమ కథలు చెబితె నమ్మే చిన్నపిల్లలు ఈడ లేరు..తెలంగాణ ల మీరు యాత్రలు చేయొచ్చు కాని మీరు ఎన్నడయితే ఈ ప్రజలను మోసం చేసిండ్రో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల నుండి వేరు పడ్డరు. మీకు ఇక్కడ ఓదార్పు దొరకదు..ఓట్లు రాలవు...మీ అయ్య పెంచిన వంది మాగధులు ఈడ మీ కోసం వెయిట్ జేస్తున్నరు..మీరు వెంట తెచ్చుకున్న కిరాయి సైన్యం ఉండనే ఉంది ఇంగే ముంది పదండి ముందుకు ...పదండి తెలంగాణ అన్నోడిని పక్కకు తోసుకు..

 జై తెలంగాణ జై జై తెలంగాణ

సోమవారం 12 నవంబర్ 2012

ఎంఐఎం భుజం మీద జగన్ తుపాకి..టార్గెట్ తెలంగాణ !



Disappointed with congress party, Asaduddin Owaisi, president of the All India Majlis-e-Ittehad-ul Muslimeen, member of Parliament, Hyderabad, announcing his party withdrawing support to ruling Congress government in state of Andhra Pradesh and UPA led in Center. Photo: Mohammed Yousuf
ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరణ వెనుక అసలు లక్ష్యం ఏంటి ? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం - జగన్ పార్టీలు చేతులు కలుపుతున్నాయా ? తెలంగాణకు మద్దతు ఇవ్వకుండా అధికారం దక్కించుకునేందుకు మజ్లిస్ ను జగన్ వాడుకుంటున్నాడా ? తెలంగాణ రావడం ఇష్టం లేని ఎంఐఎం జగన్ కు వంత పాడుతుందా ? ఇరువురి లక్ష్యం తెలంగాణను అడ్డుకోవడమే కాబట్టి ముందస్తు వ్యూహం ప్రకారం ఒక్కటవుతున్నారా ?

అవును. మజ్లిస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ పన్నాగం పన్నాడు. ఉద్యమంలో గందరగోళం రేపి, రాష్టంలో శాంతి భద్రతలు దెబ్బతీసి, అధికారం చేజిక్కించుకుని తెలంగాణ ఉద్యమాన్ని తండ్రి వైఎస్ లా అణగదొక్కేందుకు జగన్ రంగం సిద్దం చేశాడు. ఎంఐఎం - జగన్ ల ఇద్దరి లక్ష్యం తెలంగాణ రాకుండా అడ్డుకోవడమే కాబట్టి ఇద్దరూ ఒక్కటయ్యారు.

తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా జగన్ పార్టీ నాన్చుతోంది. తెలంగాణకు అనుకూలమంటే సీమాంధ్రలో ఓట్లు పడవు. అందుకే తెలంగాణ గురించి ఏమీ చెప్పకుండా ఉద్యమాన్ని అణచాలి. అన్న జైల్లో ఉంటే తియ్యని మాటలతో తల్లి విజయమ్మ తెలంగాణలో తిరుగుతుంటే ఇప్పుడు చెల్లెలు షర్మిల కూడ తెలంగాణ గడ్డమీద పాదయాత్రకు వచ్చి సానుభూతి కూడగట్టుకునేందుకు వస్తోంది. తెలంగాణలో ఎంఐఎం అండతో ఓ మోస్తరు స్థానాలు గెలుచుకుంటే సీమాంధ్రలో గెలిచే స్థానాలతో అధికారం అందుకోవచ్చన్నది జగన్ వ్యూహం.

 జగన్ జైలు నుండి బయటకు వస్తే తెలంగాణ మీద ఏదో ఓ వైఖరి చెప్పాలి. జైలులోనే ఉండి కథ నడిపిస్తే కొరకరాని కొయ్యగా ఉన్న తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు. ఇక ఓటర్లలోనూ సానుభూతికి సానుభూతి కలిసి వస్తుంది. అందుకే జగన్ జైలులో ఉండే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే పరిస్థితిని ఏర్పరుస్తున్నాడు. కాంగ్రెస్ నుండి ఓ 10 మందిని లాగితే రాష్ట్రంలో ఎన్నికలు ఖాయం. తెలంగాణ వాదులూ తస్మాత్ జాగ్రత్త...బాప్ ఏక్ నంబరి...బేటా దస్ నంబరి..జై తెలంగాణ జై జై తెలంగాణ

శనివారం 10 నవంబర్ 2012

పరకాల పరాభవం..షర్మిల పాదయాత్ర !


ఎక్కడయినా ఓడిన వారు తమ ఓటమికి  కారణాలు సమీక్షించుకుంటారు. దాదాపుగా అక్కడి పత్రికలు కూడా అదే పని చేస్తాయి. ఆ ఓడిన వ్యక్తిపై గెలిచిన వ్యక్తి ఏ విధంగా గెలిచాడు అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అంతా తిరగబడింది. గెలిచిన వ్యక్తి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడని.. ఓడిన వ్యక్తి మాత్రం దాదాపు గెలిచినంత పనిచేసిందని...అసలు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా గొప్ప అని స్థుతిస్తున్నాయి.

నిజంగా ఒక్క తెలంగాణ విషయంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పత్రికలు ఈ విధంగా స్పందిచడం..ఇలా వార్తలు రాయడం జరగదేమో. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థి మొగులూరి భిక్షపతి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.  ఈ ఓటమిని కొండా సురేఖ జీర్ణించుకుందేమో గాని సీమాంధ్ర పత్రికలకు మాత్రం ఇంకా జీర్ణంకాలేదు. పరకాల ఓడితే తెలంగాణ చాపను చుట్టేయాలని చూసిన ఆ పత్రికలు ఘోర పరాభవం చెందాయి. దాని నుండి అవి భయటపడడం లేదు.

ఇది జరిగిన చాన్నాళ్ల తరువాత ఇప్పుడు ఎందుకు చర్చ అంటే పరకాల చెల్లెమ్మ పళ్లికిలిస్తుంది. సీమాంధ్ర పత్రికలు మళ్లీ మొరుగుతున్నాయి. తెలంగాణ ను నిండా ముంచిన తండ్రిని స్తుతిస్థూ అన్న జగన్ ను అధికార పీఠం ఎక్కించేందుకు వైఎస్ తనయ షర్మిల తెలంగాణ లో పాదయాత్రకు పరుగు పరుగునా వస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు కొడిగడుతున్నా పల్లెత్తు మాట మాట్లాడని వారు ఇప్పుడు అమ్మవారి పాదయాత్ర అడుగులకు మడుగులు వత్తేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ వాదులు ఎక్కడ పాదయాత్రకు అడ్డుపడుతారోనని సురేఖమ్మ గుండెల్లో గుబులు రేగుతోంది. అందుకే టీఆర్ఎస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ వాదులను హెచ్చరిస్తోంది సురేఖమ్మ. షర్మిలమ్మ పాదయాత్రను అడ్డుకుంటే మా సత్తా చూపిస్తామని.

 జగన్ దండయాత్రను మానుకోట అడ్డుకున్న సంగతి గుర్తుకువచ్చి ఉంటుంది. తుపాకీ కాల్పులను కూడా కంకర రాళ్లతో ఎదుర్కొన్న కరడుగట్టిన తెలంగాణ వాదులు గుర్తుకు వచ్చి ఉంటారు. అందుకే పాదయాత్ర కు ముందే అమ్మ సన్నాహక సమావేశాలు మొదలు పెట్టింది. ‘‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు’’ పాదయాత్ర ఇంకా తెలంగాణలోకి రాక ముందే ఈ పరేషాన్ ఎందుకు ? మీ వైఖరిలో స్పష్టత ఉంటే అడ్డుకుంటారన్న అనుమానాలెందుకు ? గుమ్మడి కాయల దొంగ అనకముందే భుజాలు పట్టుకోవడమెందుకు ?


ఇక సోకాల్డ్ సీమాంధ్ర పత్రికలు అప్పుడే భజన మొదలు పెట్టాయి తెలంగాణ అంతటా నేతలు జగన్ పార్టీలోకి చేరడానికి దండలు పట్టుకుని రెడీగా ఉన్నారని..పరకాలలో  వచ్చిన ఓట్లు చూసి ఆ పార్టీలో చేరడానికి ఉత్సుకత చూపుతున్నారని రాసేస్తున్నాయి. అధికారంకోసం దండయాత్రలు చేస్తున్న సీమాంధ్ర పార్టీలకు ఎలా బుద్ది చెప్పాలో తెలంగాణకు తెలుసు. ముందు సురేఖ అంగబలం, అర్ధబలాలను అణగదొక్కి పరకాలలో తెలంగాణ జెండా ఎలా ఎగిరిందో ఈ సీమాంద్ర పత్రికలు ఒక్కసారి నెమరు వేసుకుంటే తెలంగాణలో భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో బోధపడుతుంది. జై తెలంగాణ జై జై తెలంగాణ