18, జూన్ 2014, బుధవారం

రిపోర్టర్ల పొట్టగొట్టి ..ఖజానా నింపుతున్న రాధాకృష్ణ !


రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెబుతున్న గురివింద నీతులు చూస్తుంటే
ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆరునెలలుగా ఆంధ్రజ్యోతి ఆర్సీ ఇంఛార్జులకు జీతాలే గతిలేవు. ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్లు లైన్ అకౌంట్ మరిచిపోయి చాలా రోజులయింది. తన అడుగులకు మడుగులొత్తే వారిని బ్రాంచ్ మేనేజర్లుగా పెట్టుకుని రిపోర్టర్ల పొట్టగొట్టి వారి కుటుంబాలను పస్తులుంచుతున్న రాధాకృష్ణ ప్రజాస్వామ్యం ..దాని విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.

ఆంధ్రజ్యోతిలో దసరాకు యాడ్లు ..దీపావళికి యాడ్లు ..కొత్త సంవత్సరానికి యాడ్లు ..సంక్రాంతికి యాడ్లు ..దీనికి తోడు ప్రతి ఏటా సీమాంధ్ర జ్యోతి వార్షికోత్సవానికి యాడ్లు. రిపోర్టర్లకు టార్గెట్లు నిర్ణయించి ..వారు తీసుకురాకుంటే డేట్ లైన్ ఉండదని హెచ్చరించి ..నలుగురిని బతిమిలాడి యాడ్లను పట్టుకొచ్చిన తరువాత ఆ యాడ్ల డబ్బులు రాలేదని డేట్ లైన్లు నిలిపివేసి రిపోర్టరు జీవితంతో బంతాట ఆడుతున్న రాధాకృష్ణ ఆండ్ కో పత్రికా స్వేచ్చ గురించి ..పత్రికా స్వేచ్చ మీద దాడి గురించి మాట్లాడుతుండడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది.

అసలు తన దగ్గర పనిచేసే కంట్రిబ్యూటర్లకు ఎలాంటి స్వేచ్చ ఇవ్వకుండా వారిని నిత్యం వేధింపుల గురించి మాట్లాడుతున్న రాధాకృష్ణకు తన వరకు వచ్చే సరికి ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తుంది. ఇటీవల ఎన్నికల్లో అసలు కంట్రిబ్యూటర్లతో సంబంధం లేకుండా బీఎంలతో డబ్బులు దండుకుని ..రిపోర్టర్ల యాడ్స్ కమీషన్ కూడా అందకుండా దండుకు తిన్నారు. ఇలాంటి పత్రికా యాజమాన్యాలు జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నాయి.

ఈనాడు, సాక్షి ఆఖరుకు ప్రజాశక్తి, ఆంధ్రభూమి దినపత్రికలు కూడా తమ కంట్రిబ్యూటర్లకు తృణమో ..పణమో నెలకింత ముట్టజెబుతున్నాయి. కానీ జిల్లాకు ఇంత టార్గెట్ పెట్టి ముక్కుపిండి వసూలు చేసుకుని తన ఖజానాలో జమ చేసుకుంటున్న రాధాకృష్ణ మాత్రం తన కంట్రిబ్యూటర్లకు ఒక్క పైసా విదిల్చింది లేదు. ఇప్పటికయినా కంట్రిబ్యూటర్ల కడుపు కొట్టకుండా ..ఆర్సీ ఇంఛార్జిల బకాయిలు చెల్లించి మాట్లాడితే కొంత సమంజసంగా ఉంటుంది.

కొత్తపల్లి సందీప్ రెడ్డి

16, జూన్ 2014, సోమవారం

రాధాకృష్ణ ..కళ్లున్న కబోధి ..!!


మొత్తానికి కేసీఆర్ దుష్టతలంపు వచ్చిందే తడవు ఆంధ్రజ్యోతి మీద పడ్డాడు. మేం దేనికీ భయపడం. తప్పుంటే
చర్యలు తీసుకోండి. కేసీఆర్ స్వయంగా ఎంఎస్ఓలకు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే తెలంగాణ టీఆర్ఎస్ మోనార్క్ ఏమీ కాదు. ఆ పార్టీకి వచ్చింది 38.5 శాతం ఓట్లే. మిగతా ప్రజల మనోభావాలకు అద్దంపట్టాల్సిన భాధ్యత మీడియాకు లేదా ? నిజామాబాద్ లో పుట్టిన నేను ఆంధ్రోడిని ఎలా అవుతాను. కానీ నన్ను ఆంధ్రోడిని చేయడంలో కేసీఆర్ విజయవంతం అయ్యాడు.

ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణ ఎంఎస్ఓలు బంద్ చేయడంతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఈ రోజు తన పత్రికలో రాసుకున్న పలుకులివి. పత్రిక నీది కాబట్టి పలుకులు ఎన్నయినా రాసుకోవచ్చు. నీవు చెప్పిందే నిజమని నీకు నువ్వే భావించుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజం నీ కారుకూతలను ..పిచ్చిరాతలను చూసి భ్రమపడిపోదు. తెలంగాణలో 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే వారికి అండగా నిలవలేని నీ పాపిష్టి మీడియా ..తెలంగాణ సమాజాన్ని అనుక్షణం గందరగోళంలోకి నెట్టి ..వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఆత్మహత్యల పాపాన్ని మూటగట్టుకున్న నీ సీమాంధ్రజ్యోతి ..తెలంగాణ విడిపోగానే సీమాంధ్ర రాజధానికి విరాళాలు సేకరిస్తుందంటే నీవు ముమ్మాటికీ ఆంధ్రోడివే అని చెప్పడానికి నీ మీద ఇంకొకరు బురద జల్లాలా ?

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని నీవు ప్రభుత్వం కొలువుదీరి పది దినాలు గడవక ముందే విషం కక్కుతూ నీ ఆలోచనలను ..అర్ధ సత్యాలను తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలుగా ప్రచురించి తెలంగాణ ప్రజల్లో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మీద అపనమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయడం నిజం కాదా ? సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజల మీద విద్వేషం కలిగించేలా ''ఏపీనా వేసెయ్ పన్ను'' అని వార్తలు రాయడం నీ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీకనా ? కాదా ?

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోనార్క్ ఏమీ కాదు దానికి వచ్చింది 38.5 శాతం ఓట్లే అని అంటున్న నీకు సీమాంధ్రలో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల శాతం ఎంతో తెలీదా ? మరి చంద్రబాబును ప్రశ్నిస్తూ నీవు రాసిన వార్తలెన్ని ? తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ రాసిన వార్తలు ఎన్ని ? ఈ కొద్ది రోజుల వార్తలు లెక్క తీస్తె నీవు ఆంధ్రోడివా ? తెలంగాణోడివా ? అన్నది తేలిపోతుంది. పత్రిక చేతిలో ఉంది కాబట్టి అప్రజాస్వామిక వార్తలు రాసి ..నీకు పడని ప్రభుత్వం మీద విషం చిమ్మి ..నీవు రాదనుకున్న తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురి చేసి ఆనందపడదాం అనుకుంటున్న నీ తిర్రి ఆలోచనలను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది.

నీవు చంద్రబాబుతో కలిసి ఎన్ని నాటకాలయినా ఆడుకో ..నీ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమయినా కురిపించుకో..కానీ తెలంగాణ మీద విషం చిమ్మడం మానుకో. వైఎస్ మూయించిన నీ పవర్ ప్లాంట్ ను కిరణ్ కుమార్ రెడ్డికి వార్తలు రాసి రాసి తెరిపించుకున్న నీవు ప్రజాస్వామ్యం గురించి ..అవినీతి గురించి అప్రజాస్వామిక ఆలోచనల గురించి మాట్లాడడం హస్యాస్పదం. తెలంగాణ సమాజం ఇప్పటికీ ..ఎప్పటికీ చైతన్యవంతమయినదే ..ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం మాకు మీలాంటి ముసుగు మీడియా సంస్థలను ఎలా ఎదుర్కోవాలో గుణపాఠాలు నేర్పింది. ఇప్పటికయినా మీ ఆలోచనలు మానుకుని తెలంగాణ ఎదుగుదలకు సహకరించండి. తెలంగాణకు చేసిన పాపాన్ని కొంతయినా కడుక్కోండి.


కొత్తపల్లి సందీప్ రెడ్డి

15, జూన్ 2014, ఆదివారం

మీడియా – తెలంగాణ


వాళ్లకు మన ఉనికి నచ్చదు. వాళ్లకు మన ఉన్నతి నచ్చదు. అరవైఏళ్లుగా జీర్ణించుకుపోయిన ఆంధ్రా ఆధిపత్య అహంకార ధోరణి వారిని ఊరికె ఉండనివ్వదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అన్న ఆలోచనే వారికి ఇంకా తట్టలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామికంగా పోరాడి తెలంగాణ ప్రజలు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేరు. అసలు సీమాంధ్ర నేతలకన్నా ఈ మీడియా మొగల్స్ తోనే తెలంగాణ ముందు ముందు పెను ప్రమాదం ముంచుకువస్తోంది. ఇది మొగ్గలోనే తుంచేయకపోతే తెలంగాణకు భవిష్యత్ లో తీరని అన్యాయం జరుగడం ఖాయం.

తెలంగాణ శాసనసభ్యులను హేళన చేస్తూ టీవీ 9, సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన ప్రసారాలు, రాసిన వార్తలు వారిలోని తెలంగాణ వ్యతిరేకతను నగ్నంగా బయటపెట్టుకున్నాయి. స్వయంగా కేసీఆర్ స్పందించడం ..తెలంగాణ శాసనసభ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మొక్కుబడి క్షమాపణలు వచ్చినా అవి భవిష్యత్ లో తమ తీరు మార్చుకుంటాయని భావించడం అత్యాశనే అవుతుంది.

అసలు ఈ సీమాంధ్ర మీడియా మూలలను దెబ్బతీస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముకాసే ఈ సీమాంధ్ర మీడియా అవకాశం దొరికితే తెలంగాణ ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కాచుక్కూర్చుంటాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడం ద్వారా తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేయడం వీటి ప్రధాన

లక్ష్యం. భవిష్యత్ లో ఏ రోజు అవకాశం వచ్చినా ఇవి దాన్ని చేజార్చుకోవు.

అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం ..కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ..ఆయన మంత్రివర్గంలో ఎలాంటి లుకలుకలు లేకపోవడం ..తొలి శాసనసభ సమావేశాలు అత్యంత హుందాగా సాగడం ..కేసీఆర్ తన భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగా సభ ముందు ఉంచడం ..దానికి ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు తెలపడం ఈ మీడియాకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. మీడియా మొగల్స్ పంచవర్ష ప్రణాళికలు అమలు పరిచే సీమాంధ్ర నేతలతో కేసీఆర్ ను పోల్చి చూసుకుని ఈ వర్గాలు కుమిలిపోతున్నాయని చెప్పక తప్పదు. కేసీఆర్ కు తెలంగాణలోని 119 నియోజక వర్గాల మీద పట్టుంది. ఏ నియోజకవర్గానికి ఏ సమస్య ఉంది అన్నది ఆయన దృష్టిలో ఉంది. గత 14 ఏళ్లుగా తెలంగాణ అణువణువూ కేసీఆర్ తిరిగి చూసిందే. అందుకే శాసనసభలో ఏకంగా 2 గంటల 40 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సాగిన తన ప్రసంగంలో నీళ్లు, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం వంటి అంశాల మీద స్పష్టమయిన వైఖరిని బయటపెట్టారు. ఈ పరిణామాలు ఏవీ సీమాంధ్ర మీడియాకు రుచించడం లేదు.

ఎంతసేపూ తెలంగాణ నేతలను బలహీన పరచడం ..తెలంగాణ ప్రజల దృష్టిలో వారి మీద అనుమానాలు రేకెత్తించడం ..అసలు వీళ్లు ఏమీ అభివృద్ది చేయలేరని, వీరికి అసలు పరిపాలన రాదని, పరిపాలనకు వీరు పనికేరారని చెప్పడం వారి ప్రధాన ఉద్దేశం. వాస్తవంగా తెలంగాణ జిల్లాలలో సీమాంధ్ర మీడియాను జనం విశ్వసించడం మానేసి చాలా కాలమయింది. కాకపోతే ఇన్నాళ్లు అలవాటు పడిన పత్రికలను, ఛానళ్లను ఒకేసారి మానుకోవడం ..దానికి తగినంత ప్రత్యామ్నాయాలు లేకపోవడం మూలంగా ఆంధ్రా మీడియాకు అవకాశంగా మారింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర మీడియాను తలదన్నే ఛానళ్లు, పత్రికలు తెలంగాణ ఔత్సాహికులు ఏర్పాటు చేసేలా తగినంత ప్రోత్సాహం ఇవ్వాలి. తెలంగాణలో ఓ ప్రత్యేకమయిన ప్రణాళికతో ఇది జరగాలి. ఇది ఎంత త్వరగా జరిగితే తెలంగాణ సమాజానికి ..తెలంగాణ ప్రభుత్వానికి ..తెలంగాణ భవిష్యత్ కు అంత లాభదాయకంగా ఉంటుంది.

- సందీప్ రెడ్డి కొత్తపల్లి
http://www.telanganatalkies.com/మీడియా-తెలంగాణ/

14, జూన్ 2014, శనివారం

పచ్చకండ్లు ..పచ్చనోట్లు..పాపిష్టి మీడియా !!


పొద్దున లేస్తె వాడు ఫోర్త్ ఎస్టేట్ గురించి ఫోజులు గొడుతుంటడు. జర్నలిజం విలువల గురించి జనుకులు
విసురుతుంటడు. వాని మైకు నిండా మైకమే గనిపిస్తది. అధికారుల అవినీతి గురించి వాడు అంతెత్తున ఎగిరినట్లు గనిపిస్తడు. మీడియా స్వేచ్చ గురించి వాడు నిప్పులు గురిపిస్తుంటడు. కానీ వానిదంతా ఆధిపత్యపు అహంకార ధోరణే. వాని నిలువెల్ల విషమే. వాని దృష్టిలో మీడియా స్వేచ్చ అంటే వాని ప్రయోజనాలు ..వాని సామాజికవర్గ ప్రయోజనాలు. వాడు నందిని పట్టుకొని పంది అంటడు ..పందిని పట్టుకొని నంది అంటడు. అదే జర్నలిజం విలువ వాని దృష్టిల.

ర్యాగింగ్ జరిగి ఆ పిల్లల తల్లిదండ్రులు నెత్తీ నోరు బాదుకుంటుంటే అవే దృశ్యాలను పదే పదే తన టీవీలో ప్రదర్శించి ఆ కుటుంబానికి తీరని వేదన మిగిలిస్తాడు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయాలని ప్రచారం చేస్తాడు. తనకు అన్ని కోట్లు ఎలా వచ్చాయో మాత్రం చెప్పడు. పచ్చళ్లు అమ్ముకునెటాయిన ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి వెళ్తాడు.ఆయన కష్టపడి వెళ్లినట్లు. మిగతావాళ్లు ఆయన కనుసన్నలలో పనిచేయాలంటాడు. అసలు జర్నలిజాన్ని ఓ పరిశ్రమలా చేసింది ఈ దుర్మార్గులె. నలుగురికి ఉపయోగపడాల్సిన మీడియాను అంగట్లో సరుకులా మార్చింది ఈ ఆంధ్రా వలస దోపిడీ దారులె. తెలంగాణ సంపదను తేరగా దోచుకుని అది బయట పడకుండా ఉండేందుకు తమ మైకులను అడ్డుగా పెట్టుకున్నారు.

ప్రశ్నించలేని వ్యక్తులను పంచన జేర్చుకుని ..నిలదీయలేని నేతలను తమ గుమ్మాలకు కాపలాగా చేసుకుని మీడియా మొఘల్లుగా చెలామణి అవుతున్నారంటే జర్నలిజం విలువలు ఏ స్థాయికి దిగజారి పోయాయో అర్ధం చేసుకోవచ్చు. సీమాంధ్ర పెట్టుబడిదారులను తమ చుట్టూ చేర్చుకుని ..వారి అండతో తెలంగాణ నేతలను ఇన్నాళ్లు వాడుకున్నారు. ఇప్పటికి తెలంగాణ వచ్చినా ఆంధ్రా పార్టీలకు వంతపాడుతున్నారంటే ఇప్పటిదాకా తయారయిన ఇలాంటి వంధిమాగదులే కారణం. దేశంలోనే ఎక్కడా లేనన్ని పత్రికలు ..ఛానళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా మీడియా ఇంత పటిష్టంగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. రాజకీయ నాయకులు ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా పనిచేయాలి. కానీ ఈ మీడియా వెనుక ఉన్నదే పెత్తందారి వ్యవస్థ. ఇక్కడ వారి ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాలను చేసి పరిశ్రమలు, భూములు కొల్లగొట్టారు. ప్రతి వ్యవస్థలోనూ వీరు వేళ్లూనుకున్నారు. వీరిది మీడియా అంటే ..జర్నలిస్టులు సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రజల ప్రయోజనాలే జర్నలిస్టు ప్రయోజనాలు తప్పితే ..పెత్తందారి ప్రయోజనాలు ..అవసరాలు ఎన్నటికీ ప్రయోజనాలు కావు. మీడియా స్వేచ్చ కాదు ..కా జాలదు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మీడియా వ్యవస్థని బొందపెట్టాలి. ఫోర్త్ ఎస్టేట్ మీద ప్రజల నమ్మకాన్ని పెంచాలి.

జై తెలంగాణ

కొత్తపల్లి సందీప్ రెడ్డి 

కేసీఆర్ ..వ్యక్తి కాదు ..వ్యవస్థ

ఏ రాజకీయ నాయకుడు అయినా చేసేది ఒక్కటే పని. అధికారం చేతికి వస్తే ..మనకేం గిట్టుబాటవుతుంది ..మన
చుట్టుపక్కల వారికి ఏం గిట్టుబాటవు తుంది. ఈ అయిదేళ్లలో ఎంత మాత్రం వెనకేసుకోగలం. ప్రతిపక్షాలను ఎలా ఇరుకున పెట్టగలం. ప్రజల దృష్టిని ఎలా పక్కకు మళ్లించగలం. మన తప్పిదాలను ప్రజలు గుర్తించకుండా ఏం చేయగలం ? ఇలాంటి ఆలోచనలు తప్పితే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమయిన విషయాల మీద కూడా కనీసం స్పష్టమయిన అవగాహన ఉండదు. ఏ విషయం తెలుసుకోవాలన్న కిందిస్థాయి అధికారులు సమాచారం ఇవ్వాల్సిందే. వారు చెప్పిన వివరాలనే చెప్పడం తప్పితే సొంతంగా ఓ అంశం మీద ఎలాంటి అవగాహన ఉండదు. కానీ తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు చూసిన రాజకీయ నేతలంతా కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. ఆయనను పాఠంగా భావించి చదువుకోవాలి.

కృష్ణ, గోదావరి నదులకు సంబంధించిన వాటా గురించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా నేనే వాదిస్తాను అని నిండు శాసనసభ సాక్షిగా కేసీఆర్ ప్రకటించడం చూస్తే ఖచ్చితంగా ఇంతవరకూ ఏ నాయకుడూ ఇంత ధైర్యంగా  ప్రకటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కేసీఆర్ కు నదీ జలాల కేటాయింపుల విషయంలో ఎంత అవగాహన లేకుంటే స్వయంగా తానే వాదిస్తానన్న ప్రకటన చేసి ఉంటారు. జల నిపుణులు, తలపండిన ఇంజనీర్లు చేయాల్సిన పనిని తాను చేస్తానని కేసీఆర్ తేల్చేశాడు. కేసీఆర్ ఏం వాదిస్తాడు అని కనీసం ప్రతిపక్షాలు అభ్యంతరం కూడా చెప్పలేకపోయాయి అంటే కేసీఆర్ వారిని ఎంతలా ఒప్పించగలిగారో ..మెప్పించగలిగారో అర్ధం చేసుకోవాలి.

తెలంగాణకు సంబంధించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జరుగుతున్న వాద ..ప్రతివాదాలపై కేసీఆర్ కు స్పష్టమయిన అవగాహన ఉంది. కిందిస్థాయిలో జరుగుతున్న ప్రతి విషయం కేసీఆర్ కు తెలుసు.  ఆయనకు ఈ విషయంలో ప్రత్యేకంగా జిల్లాల వారి క్షేత్ర వివరాలు ప్రత్యేకంగా వేగులు ఉంటారని ..వారు ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా కేసీఆర్ తో టచ్ లో ఉంటారని అంటుంటారు. కానీ ఎంత మంది ఆంధ్రానాయకులకు ఈ విధంగా అవగాహన ఉంది. కేసీఆర్ లా ఎంతమందికి క్షేత్రస్థాయి వివరాలు తెలుసుకుంటుంటారు అంటే అది అనుమానమే.

శాసనసభను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ దాదాపు రెండుగంటలు మాట్లాడితే విద్యుత్, విద్య, వైద్యం, తెలంగాణ ఉద్యమం, అమరులు, వారి కుటుంబాలు, తెలంగాణకు సహకరించిన రాజకీయ పార్టీలు, తెలంగాణ జిల్లాలలో పేదలు, బలహీనవర్గాలు, ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు ..వాటిని అమలు చేయబోయే విధానం, తమిళనాడు తరహా రిజర్వేషన్, తమిళనాడులో అసలు అలా రిజర్వేషన్లు ఎందుకు డిమాండ్ లోకి వచ్చాయి. వాటిని వారు ఎలా అమలు చేస్తున్నారు. ఆ తరహా రిజర్వేషన్లు తెలంగాణకు ఎందుకు అవసరం. రుణమాఫీ అమలు ఎలా ..తెలంగాణకు భవిష్యత్ లో విద్యుత్ అవసరాలను ఎలా తీర్చుకోవాలి. రాబోయే సంవత్సరాలలో ఎంత విద్యుత్ ఉత్పత్తి స్థాయికి ఎదగాలి. తెలంగాణ నదీ జలాల వాటాలు ..ఏ జిల్లాకు ..ఏ నియోజకవర్గానికి సాగునీరు అవసరాలు ఎలా తీర్చాలి. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ..ఏ ప్రాంతానికి సాగునీరు అందుతుంది.

తెలంగాణలోని పది జిల్లాలు ..119 నియోజకవర్గాల మీద కేసీఆర్ కు స్పష్టమయిన అవగాహన ..తెలంగాణలో ఏ జిల్లాలో ఏ పంటలు వేస్తారు ? ఎక్కడ ఏ పంట అధికంగా పండుతుంది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా ఎలా ? ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు పెట్టవచ్చు. వాటికి నిధులు ఎలా తీసుకురావాలి అంటూ కేసీఆర్ అనర్గళంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కేసీఆర్ ప్రసంగం విన్న విపక్ష నేతలంతా ఆయనను అభినందించకుండా ఉండలేకపోయారు. ప్రతిపక్ష నేతలు పలు విషయాలలో కేసీఆర్ ను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఎక్కడా తడబడలేదు. అన్ని సమస్యలకు అఖిలపక్షం వేసి సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని చెప్పి ప్రతిపక్షాల ముందరికాళ్లకు బంధం వేశారు. పదే పదే అధికారం దక్కిందన్న గర్వం లేదు. గెలిచాం కాబట్టి మేం చెప్పినట్లే వినాలన్న భేషజం లేదు అని ప్రకటించి ప్రతిపక్షాలనే డిఫెన్స్ లోకి నెట్టేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ..వారి కలలు నెరవేర్చేందుకు సహకరించాలని  చెప్పి వారు కలిసి రావాల్సిన పరిస్థితిని కల్పించారు. కేసీఆర్ వ్యవహార శైలి ..సమస్యలపై కేసీఆర్ కు ఉన్న అవగాహన ..క్షేత్రస్థాయి అంశాలపై కేసీఆర్ కు ఉన్న పరిశీలనా దృష్టి ప్రతి నేతకూ అవసరం.  తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ కు ఉన్న విషయ పరిజ్ఞానం ..పరిశీలనను నేతలు అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రాంతాలకు అతీతంగా నేతలు ఆయనను ఫాలో కావాలి. నేతలంతా ఖచ్చితంగా ఓ పాఠంగా స్వీకరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

sandeepreddy kothapally