5, నవంబర్ 2013, మంగళవారం

శబరిమల యాత్ర - తెలంగానం

యాడికొయ్యినా మనకు తెలంగాణ యాదే ఉంటది. వెయ్యి మంది బలిదానాలు మనను ఒక్క తాన నిల్వనిస్తయా
..తెలంగాణను ఒక్క మాట అననిస్తయా. అందుకే మాల వేసుకుని శబరిమల వెళ్లినా యాది మాత్రం తెలంగాణ మీదనే ఉంటది. పోత పోత ఎర్మేలి కాడ చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి వచ్చిన మేస్త్రి కండ్లవడ్డడు. మన పానం ఊకుంటదా. ఏంది అన్నా మీ తాన సమైక్యాంధ్ర నంట గద ఎట్లుంది అని గెలుకుతి. మనోడు గుడ్క ఏమీ తడుముకోలే. పన్లేనోళ్లు నాలుగు దినాలు లొల్లి వెట్టిండ్రు. ఇప్పుడు ఎవడూ పత్తలేడు అని జెప్పిండు. ఆ జోలి ఇని నా కడుపు సల్లవడ్డది.

ఇంగ పంబల తానం జేసి కొండ ఎక్కవడ్తిమి. మనోళ్లు జర ముందల్నే పొయ్యిండ్రు. శరంగుత్తి ఆల్ కాడ శరం గుచ్చి టెంకాయలు కొట్టి అల్సట తీసుకునేందుకు కూసున్నరు. అంతే చిత్తూరాయిన పోరడు పాపం నాయకులు నేర్పిన నాలుగు మాటలు ఇన్నంటుంది. సమైక్యాంధ్ర అంటున్నడంట. మనం పోంగనే మనోళ్లు మనకు అంటిచ్చిండ్రు. అన్న ఈన సమైక్యాంధ్ర అంటున్నడు అని. నేను మొదలు వెట్టిన నీ సమైక్యం నీ తాననే ఉండని..  మా తెలంగాణ మేం ఏలుకుంటం అని అన్న. ఎప్పుడన్న రావాలన్పిస్తే మా ఇంటికి రా బువ్వ వెట్టి తోల్త అని జెప్పిన. మీరు గుడ్క
రాండ్రి తిరుపతిల మా దేవున్ని సూతురు అనవట్టె. అరె ఇప్పుడె సమైక్యం అంటివి అప్పుడే మీ దేవుడు ఎట్లయితడు రా బై అని మా బాలస్వామి అందుకున్నడు. మనోడు నోరు తెర్వలె.

మెల్లగ టెంకాయ గొట్టొచ్చి తెలంగాణ పాట వెట్టుకున్న. అదేంది దేవుని కాడికొచ్చి తెలంగాణ పాటలు వెట్టినవ్...అయ్యప్ప పాటలు వెట్టు అనవట్టె చిత్తూరాయిన. అరె బాబు మాకు దేవుడయినా ..దయ్యవయినా తెలంగాణనే. నీకు ఇష్టం లేకుంటే ఈన్నుంచి పో అని గట్టిగనే అన్న. మళ్ల మనోడు నోరు తెర్వలే. మెల్లగా మేం మళ్ల బాటవట్టినం. సన్నిదానం దగ్గరికోయినంక ఓ తాన కూసున్నం. పక్కనే ఓ అయ్యగారు (విజయవాడకు చెందిన బ్రాహ్మణుడు) వచ్చి శెల్ల ఏసుకోని పడుకున్నడు.

ఏం అయ్యగారు చానమంది వచ్చినట్లుంది అయ్యగార్లు (కింద పంబ నదిల మా పక్కననే తానం జేసిండ్రు) అని జోలి మొదలయింది. ఏంది మీ తాన సమైక్యం కథ అని అడిగినం. తెలంగాణ వచ్చేసింది గద ఇంగెక్కడి సమైక్యాంధ్ర. ఆల్రెడీ నిర్ణయం అయిపోయినంక ఇంగేముంటది అనవట్టె. అదేంది అయ్యగారు మీ తాన బాగ లొల్లి జేస్తుండ్రు గద ..మీడియాల ఒక్కటే సూపుతుండ్రు అని అడిగినం. మీడియా పేరు ఎత్తంగనే అయ్యగారికి మండింది. అసలు మీడియాను ఎవడండీ నమ్మేది. కృష్ణా నదిల నీళ్లు తగ్గినప్పుడు దానిలో ఇళ్లు కట్టుకుంటారు. వర్షాకాలం నీళ్లు వచ్చి ఇండ్లు మునగంగనే మునిగిపోయారని, ఇళ్లు కొట్టుకుపోయారని వార్తలు ఏస్తరు. అసలు అందులోకి వెళ్లేది ఎందుకు ? మునిగేది  ఎందుకు ?

తెలంగాణ ఇస్తే నేనేమన్న పౌరోహిత్యం మానేసి ఇంకో పని చేస్తనా..ఇదే పని గద చేసేది. పెద్దోళ్లు ఆడిస్తున్న నాటకం. లేనోడు అడుక్కు తింటున్నాడు..ఉన్నోడు దోచుకు తింటున్నాడు. అటు ఇటుగాని మధ్య తరగతి వాడు ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నడు అని అన్నడు. ఈ సారి జగన్ దొంగ అని తెల్సినా వాడికే ఓటెస్తరు...ఇక వచ్చేసారి చెప్పలేం. టీడీపీ జనం నమ్మట్లేదు అని అన్నడు. అయ్యగారి మాటలతో మాకు అందరికీ సంతోషం అయింది.

ఇక రాత్రికి దర్శనం చేసుకుని, పొద్దున్నే నెయ్యాభిషేకం చేయించుకుని తిరుగుబాట పట్టాం. శరంగుత్తి ఆల్ దగ్గరకు వచ్చే సరికి పక్కన్నే అర్చన  (మనవాళ్లు ఎవరయినా చనిపోతే అక్కడ ఓ పది రూపాయలు ఇస్తే వారి పేరు చెప్పి ఓ టపాకాయ్ పేలుస్తారు. అడవి జంతువులు భక్తుల దారిలోకి రాకుండా టపాకులు పేలుస్తారు. అయితే దానిని ఈ విధంగా మార్చి ఆలయానికి ఆదాయ మార్గంగా మార్చుకున్నారు) స్టాల్ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి జోహార్ తెలంగాణ అమర వీరులకు ..జై తెలంగాణ అని చెప్పించాను. ఆయన తెలంగాణ అని మరో రెండు సార్లు ఉచ్చరించాడు. తెలంగాణ పదం వినగానే ఆయన మొఖం వెలిగిపోయింది. పక్కనే ఉన్న కేరళ అయ్యప్ప స్వాములతో మళయాళంలో తెలంగాణ గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. తెలంగాణ వారికి అర్చన చెప్పించుకున్నాడు అని వారికి చెప్పడం మాకు అర్ధమయింది. శబరి మల వెళ్లే తెలంగాణ వారంతా ఈ సారి అమర వీరులకు ఇలాగే అర్చన చేయిస్తారని కోరుకుంటున్నాను. శరంగుత్తి ఆల్ తో పాటు పైన గుడి ఎదురుగా లైన్ల పక్కన కూడా ఇలా చెప్పే అర్చన కేంద్రం ఉంటుంది. ఎవరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి.